Nation

Wayanad Landslides: లెఫ్టినెంట్ కల్నల్ గా సహాయక చర్యల్లో పాల్గొన్న మోహన్‌లాల్

mohanlal
mohanlal

మెప్పాడి: వాయనాడ్‌లో ప్రకృతి విపత్తువల్ల కొండచరియలు విరిగిపడి నష్టపోయిన వారిని ఓదార్చేందుకు మలయాళం సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ మెప్పాడిలోని సహాయ శిబిరాన్ని సందర్శించారు. లెఫ్టినెంట్ కల్నల్ కూడా అయిన మోహన్ లాల్ ఆర్మీ క్యాంపుకు చేరుకుని అక్కడి నుండి ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ఆర్మీ అధికారులతో చర్చలు కూడా జరిపారు.

ఇదిలా ఉండగా, ఈరోజు మోహన్‌లాల్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన “వయనాడ్ జిల్లాలోని మెప్పాడి ప్రాతం మారు భూమిగా మారింది. ఆరు జోన్లలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ విపత్తు సందర్భంగా ధైర్యంగా పని చేస్తున్న ప్రతి నిస్వార్థ వాలంటీర్‌లకు , పోలీసు సిబ్బందికి, ఫైర్ అండ్ రెస్క్యూ, NDRF, ఆర్మీ జవాన్లు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు. ఇంతకు ముందు కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం.ఈ క్లిష్ట సమయంలో మనమందరం కలిసి నిలబడి ఐక్యత యొక్క బలాన్ని చూపించాలని ప్రార్థిస్తున్నాను” అని మోహన్‌లాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

ముండకై దుర్ఘటనలో మృతుల సంఖ్య 300 దాటింది. ఇప్పటి వరకు 206 మృతదేహాలు, 134 శరీర భాగాలను వెలికి తీశారు. ఆ శరీర భాగాల డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. ఇంకా 206 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. 86 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 91 సహాయ శిబిరాల్లో 9328 మంది నివసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Wayanad Landslides: కొండచరియలు విరిగిపడడానికి ఇదే కారణం అంటున్న వాతావరణ శాస్త్రవేత్త