చెన్నై: “తమిళనాడు గడ్డపై హిందీ ఆధిపత్యానికి, హిందీ భాషకు చోటు లేదు.. ఇక్కడ మా ఖచ్చితమైన వైఖరి ఒక్కటే, అది ద్విభాషా విధానం మాత్రమే” అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తేల్చిచెప్పారు. భాషా అమరవీరుల దినోత్సవం (Language Martyrs Day) సందర్భంగా శనివారం ఆయన కేంద్ర ప్రభుత్వంపై మరియు హిందీ భాషా రుద్దుడుపై నిప్పులు చెరిగారు.
1965లో హిందీ వ్యతిరేక ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ సీఎం స్టాలిన్ ఘన నివాళులర్పించారు. చెన్నైలోని గిండి ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, డీఎంకే సీనియర్ నేతలు పాల్గొన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
తమిళనాడులో కేవలం తమిళం మరియు ఇంగ్లీష్ మాత్రమే అధికారికంగా కొనసాగుతాయని, మూడో భాషగా హిందీని దొడ్డిదారిన తీసుకురావాలని చూస్తే సహించేది లేదని స్టాలిన్ హెచ్చరించారు. అన్నాదురై ప్రవేశపెట్టిన ద్విభాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం (NEP) ద్వారా లేదా ఇతర ప్రభుత్వ కార్యకలాపాల ద్వారా హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. భాష కోసం ప్రాణాలిచ్చిన వారి త్యాగాలను వృధా కానివ్వబోమని, తమిళ భాషా రక్షణ కోసం తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని శపథం చేశారు.

