వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక సానుకూల పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ఉన్న సున్నితమైన కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు అమెరికా మరియు ఇరాన్ ప్రతినిధులు ఒక ఒప్పందానికి దాదాపుగా చేరువయ్యారు. అయితే, ఈ కీలక ముందడుగు అమలుకావాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది.
కాల్పుల విరమణను పొడిగించడంతో పాటు, ఇరాన్ అణు కార్యక్రమంపై లాంఛనంగా చర్చలు ప్రారంభించేందుకు రెండు దేశాలు ఒక అవగాహన ఒప్పందానికి (MoU) అంగీకరించాయి. చాలామటుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎలా పారబోయాలి మరియు భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ కట్టుబడి ఉండేలా ఈ చర్చలు సాగనున్నాయి.
ప్రతిపాదిత డీల్ ప్రకారం, గ్లోబల్ ట్రేడ్కు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ గుండా నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు, వేధింపులు లేదా సుంకాలు ఉండవు. రాబోయే 30 రోజుల్లోగా జలసంధిలో ఇరాన్ అమర్చిన మందుపాతరలన్నింటినీ ఆ దేశమే తొలిగించాల్సి ఉంటుంది. ఒకసారి వాణిజ్య నౌకల రాకపోకలు పునఃప్రారంభమైతే, ప్రతిఫలంగా అమెరికా కూడా తన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది.
ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే, దాదాపు 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా ఈ ఒప్పందంలో కీలకంగా ఉన్నాయి. విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ సొంత నగదు (సుమారు $24 బిలియన్లు) గురించి అమెరికా చర్చలు జరపనుంది. ఇందులో కనీసం $20 బిలియన్ల నిధులను వాడుకోవడానికి ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ తన ముడి చమురును స్వేచ్ఛగా విక్రయించుకునేలా అమెరికా కొన్ని ఆంక్షల మినహాయింపులను జారీ చేసేందుకు సుముఖంగా ఉంది. మానవతా సహాయం మరియు వస్తువులను ఇరాన్ స్వీకరించడానికి ఒక మెకానిజంను కూడా చర్చిస్తున్నారు.
ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాపై మంగళవారం నాటికే చాలా వరకు ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, దీనిపై ఇరు పక్షాల సీనియర్ నాయకత్వం తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్కు ఈ ఒప్పందం వివరాలను వివరించినప్పటికీ, ఆయన వెంటనే సంతకం చేయలేదని.. దీనిపై ఆలోచించడానికి తనకు “కొన్ని రోజుల సమయం” కావాలని కోరినట్లు మీడియా చెపుతోంది.



