న్యూఢిల్లీ: దేశీయంగా చమురు కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు అనివార్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ వద్ద నెలకొన్న అస్థిరత కారణంగా అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది.
మన దేశానికి అవసరమైన ముడిచమురులో 85 శాతాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాము. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 110 డాలర్ల మార్కును సైతం తాకాయి. ఈ పెరిగిన భారాన్ని వినియోగదారులపై మోపకుండా చమురు సంస్థలే భరిస్తుండటంతో.. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ సుమారు రూ. 1,000 కోట్ల మేర నష్టపోతున్నట్లు సమాచారం.
పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని దేశ ప్రజలకు, సంస్థలకు విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH), ఆన్లైన్ మీటింగ్లు, ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగం పెంచడం, వీలైనంత వరకు పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయాలని సూచించారు.
దేశంలో ప్రస్తుతం ఎలాంటి ఇంధన కొరత లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అయితే, ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని పిలుపును పౌరులు ఒక “వేకప్ కాల్”గా (మేల్కొలుపు) పరిగణించాలని మంత్రి హెచ్చరించారు. సీఐఐ (CII) వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో మాట్లాడిన ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒక భారీ షాక్ రాబోతోంది. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే, తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి” అని ఆయన హెచ్చరించారు.
బంగారం, వెండి తదితర లోహాలపై ఇప్పటికే దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడం ద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగితే.. రవాణా వ్యయం అధికమై నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం (ద్రవ్యోల్బణం) ఉంటుంది. కంపెనీలను ఇలా రోజువారీ నష్టాల్లో మునిగిపోనివ్వలేరు కాబట్టి, రానున్న రోజుల్లో సామాన్యులపై పెట్రో వాత తప్పకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.



