భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) మరియు ‘అమృత్ భారత్’ (Amrit Bharat) రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే బోర్డు కీలక వెసులుబాటు కల్పించింది. ఈ రైళ్లలో అత్యవసర కోటా (Emergency Quota – EQ) ను పునరుద్ధరిస్తూ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది.
భారతీయ రైల్వే బోర్డు 2024లో జారీ చేసిన కమర్షియల్ సర్క్యులర్ నం. 25 ప్రకారం, వందేభారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ (High Official Requisition – HOR) ను పూర్తిగా రద్దు చేసింది. సాధారణ ప్రయాణికులకు ఎక్కువ సీట్లు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అత్యవసర సమయాల్లో ప్రజాప్రతినిధులు, విఐపీలు, మరియు తీవ్ర అనారోగ్యంతో బాధపడే రోగులకు సీట్లు దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో, రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని పున సమీక్షించుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ రెండు ప్రీమియం రైళ్లలోనూ ఎమర్జెన్సీ కోటాను తిరిగి ప్రవేశపెట్టారు. జోనల్ రైల్వేల అభ్యర్థనలు మరియు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి.
సామాన్యుల రైలుగా పిలవబడే ‘అమృత్ భారత్’ రైళ్లలో కూడా ఈ కోటా వర్తిస్తుంది. దీంతో దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో వెళ్లే సామాన్య ప్రజలకు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ కోటా ద్వారా టికెట్లు పొందే అవకాశం లభిస్తుంది.

