హైదరాబాద్: నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేసే దిశగా తెలంగాణా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సనత్నగర్లో నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS – టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వచ్చే ఉగాది పర్వదినాన (మార్చి 19, 2026) ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఆసుపత్రి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించనుంది.
హైదరాబాద్ నలుమూలలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా సనత్నగర్ టిమ్స్ నిర్మాణం పూర్తయింది. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు దాదాపు కొలిక్కి వచ్చింది. ముఖ్యంగా క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే కాక మరో మూడు టిమ్స్ ఆసుపత్రుల పనులు కూడా వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
టిమ్స్ సనత్నగర్లో ప్రధానంగా కార్డియాక్ (గుండె సంబంధిత) మరియు ట్రాన్స్ప్లాంట్ (అవయవ మార్పిడి) సేవలపై దృష్టి సారించారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. గుండె జబ్బులు, కిడ్నీ వైఫల్యం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పేద రోగులకు ఇది వరంగా మారనుంది.
ప్రస్తుతం నగరంలోని పేదలు క్లిష్టమైన ఆపరేషన్ల కోసం గాంధీ, ఉస్మానియా లేదా నిమ్స్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా ఆసుపత్రులలో పడకల కొరత, వైద్యులపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఇప్పుడు సనత్నగర్ టిమ్స్ అందుబాటులోకి వస్తే, సికింద్రాబాద్, కూకట్పల్లి, బాలానగర్, మరియు పటాన్చెరు ప్రాంతాల ప్రజలకు అక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు లభిస్తాయి. తద్వారా ప్రధాన ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

