(వెబ్ డెస్క్): హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ, ముక్కంటికి ఇష్టమైన రోజు ‘మహాశివరాత్రి’ రానే వచ్చింది. మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకునే ఈ పవిత్ర పర్వదినం కోసం తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 15, ఆదివారం నాడు మహాశివరాత్రిని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పండితులు నిర్ణయించిన ముహూర్తాలు, లింగోద్భవ కాలం, మరియు పూజా విశేషాలు ఇలా ఉన్నాయి.ముహూర్త వివరాలు:పంచాంగం ప్రకారం, మాఘ బహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి 15న సాయంత్రం 05:04 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు (ఫిబ్రవరి 16) సాయంత్రం 05:34 గంటలకు ముగుస్తుంది. శివరాత్రి నాడు రాత్రి పూజకే అధిక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ఆదివారం రాత్రే జాగరణ, పూజలు నిర్వహించాలి.
అత్యంత పవిత్రం.. లింగోద్భవ కాలం
శివరాత్రి నాడు శివ లింగానికి అభిషేకం చేయడానికి అత్యంత శ్రేష్టమైన సమయం ‘లింగోద్భవ కాలం’. పండితుల సూచన ప్రకారం, ఈసారి లింగోద్భవ కాలం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి (తెల్లవారితే సోమవారం) 12:09 గంటల నుంచి 01:01 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే రుద్రాభిషేకం అనంత కోటి పుణ్యఫలాన్ని ఇస్తుందని ప్రతీతి.
నాలుగు జాముల పూజ
శివరాత్రి జాగరణలో భాగంగా రాత్రిని నాలుగు ప్రహరాలుగా (జాములుగా) విభజించి పూజలు చేస్తారు:మొదటి జాము: రాత్రి 06:11 – 09:23 వరకు.రెండవ జాము: రాత్రి 09:23 – 12:35 వరకు.మూడవ జాము: అర్ధరాత్రి 12:35 – 03:47 వరకు.నాలుగవ జాము: తెల్లవారుజామున 03:47 – ఉదయం 06:59 వరకు.ఉపవాసం – పారణ:ఆదివారం రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేసే భక్తులు.. సోమవారం (ఫిబ్రవరి 16) ఉదయం 06:59 గంటల తర్వాత, మధ్యాహ్నం 03:24 గంటల లోపు ఉపవాస దీక్షను విరమించవచ్చు.
పఠించాల్సిన స్తోత్రాలు:
ఈ పర్వదినం నాడు ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే శివాలయంలో లింగాష్టకం, బిల్వాష్టకం, శివ తాండవ స్తోత్రం పఠించడం ద్వారా పరమేశ్వరుని కృపకు పాత్రులవుతారని పండితులు సూచిస్తున్నారు.

