మహా మృత్యుంజయ మంత్రంను “మరణం జయించే మంత్రం” లేదా “త్రయంబక మంత్రం” అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. మహా మృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం .
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
మృత్యుంజయ మంత్రం అర్థం
మహా మృత్యుంజయ మంత్రం: అకాల మరణ భయం పోగొట్టి, ఆరోగ్యాన్ని ఇచ్చే పరమశివుని మంత్రంమహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి? ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? అసలు ఈ మంత్రానికి అర్ధం ఏమిటి ? ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా ?
మూడు నేత్రాలు గల పరమేశ్వరుణ్ణి (త్రయంబకం) మనం ధ్యానిస్తూ జపిస్తున్నాము.ఆయనే మనకు సుగంధములా ఆత్మానందాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని వృద్ధి పరచేవాడు.కాయ పండు చెట్టునుండి సహజంగా వేరైనట్లు, ఈ జీవుడు మరణ బంధనాలనుండి విముక్తి పొందాలి. నాకు అమృతమయ జీవనము ప్రసాదించు.
ఇది ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయనిచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడెను.
ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము; త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు; మృత్యోర్ = మృత్యువు నుండి;అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు;మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.
ఈ మంత్రంలో దోసకాయ ఉపమానం అత్యంత కీలకమైనది. ఈ ఉదాహరణని సరిగా అర్థం చేసుకుంటేనే ఈ మంత్రం లోని అసలు అర్థం బోధపడుతుంది.మంచి సువాసనలని వెదజల్లుతూ పుష్టిగా పెరిగినటువంటి దోసకాయ ఏ విధముగానైతే తొడిమ వద్ద, పాదు నుండి ఏ ప్రయత్నమూ లేకుండా విడిపోతుందో, ఆ విధముగా, మృత్యువు వలన, (సంసార) బంధనాలనుండి ముక్తిని ప్రసాదించమని, ఆ త్రయంబకేశ్వరుడిని ప్రార్థిస్తున్నాము, అమరత్వము నుండి మాత్రం కాదు.
తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!
ప్రాశస్త్యము:మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం” పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం.
ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని పారాయణం చేస్తారు.
ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.
ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది.
ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 𝟏𝟎𝟖 సార్లు, ప్రదోషకాలంలో 𝟏𝟎𝟖 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది.
ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది.

