ఢాకా: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న బీఎన్పీ అధినేత తారిఖ్ రెహ్మాన్.. తన విదేశాంగ విధానం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్క దేశానికో ప్రాధాన్యత ఇవ్వకుండా, “బంగ్లాదేశ్ ప్రయోజనాలే పరమావధి”గా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
పొరుగు దేశాలతో సంబంధాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. భారత్, పాకిస్థాన్ లేదా చైనా పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమమే తమ విదేశాంగ విధానానికి మూలస్తంభమని తేల్చిచెప్పారు.
దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, సుపరిపాలన తమ ముందున్న ప్రధాన సవాళ్లని తారిఖ్ పేర్కొన్నారు. మతం, కులం, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన న్యాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అరాచక శక్తులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ప్రస్తుత తరుణంలో.. అన్ని దేశాలతో సమతుల్య సంబంధాలు నెరపాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆయన ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం.

