అంతర్జాతీయ క్రికెట్లో కొన్ని నిర్ణయాలు భావోద్వేగంతో తీసుకుంటే, మరికొన్ని వ్యూహాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ ఆడటానికి పాకిస్థాన్ అంగీకరించడం ద్వారా ఆ దేశం ఎంత ఒత్తిడిలో ఉందొ మరోసారి తేటతెల్లం చేసింది . మొదట్లో బాయ్కాట్ చేస్తామని చెప్పినప్పటికీ, చివరికి ఆడటానికి ఒప్పుకోవడం ఆ దేశానికి తప్పలేదని క్రికెట్ పండితులు చెపుతున్నారు.
పాకిస్థాన్ మొదట మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని చెప్పడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ను బెదిరించాలని అనుకుంది. బంగ్లాదేశ్ ను వెనకేసుకు రావడం ద్వారా మరికొన్ని దేశాలు తమకు మద్దతు ఇచ్చి భారత్ పరువు తీస్తాయని ఊహించింది. అయితే పాకిస్తాన్ వేసిన ఈ తప్పటడుగు క్రికెట్ ప్రపంచంలో తరచూ ఒంటరిగా మిగిలిపోయే పాకిస్థాన్కు మరోసారి నిరాశే మిగిలింది.
భారత్-పాక్ మ్యాచ్ కేవలం ఆట మాత్రమే కాదు, అది ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు. టోర్నీ ప్రసార హక్కుల విలువలో దాదాపు 20-30% ఈ ఒక్క మ్యాచ్ నుంచే వస్తుంది. ఒకవేళ పాకిస్థాన్ ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేసి ఉంటే, ఐసీసీ నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చేది. బీసీసీఐ (BCCI) ఆదాయం ఐసీసీపై ఆధారపడదు కానీ, పాకిస్థాన్ బోర్డు (PCB) మనుగడకు ఐసీసీ నిధులు అత్యంత కీలకం.
అంతేకాదు, మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్ విలువైన పాయింట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఆసియా దేశాలైన శ్రీలంక, యూఏఈ వంటి ఇతర బోర్డుల నుండి కూడా పాక్ కు మద్దతు లభించలేదు. అందరి మాట కాదని మొండిగా వెళ్తే, అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ మరింత ఏకాకిగా మారే ప్రమాదం ఉంది అని అది భావించింది.
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో భారత్ ఆర్థికంగా, అధికారికంగా చాలా బలంగా ఉంది. ఐసీసీ ఆదాయంలో 38.5% భారత్దే కాగా, పాకిస్థాన్ వాటా కేవలం 5-6% మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో, ఎమోషనల్గా కాకుండా, ప్రాక్టికల్గా ఆలోచించి ఆడటమే మేలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆలోచించింది.

