అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని (Ap Captial) అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విరాళాల సేకరణ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది. సీఆర్డీఏ వెబ్ సైట్ crda.ap.gov.in లో ఆన్లైన్ ద్వారా సులభంగా విరాళాలు పంపేలా QR కోడ్ ఆధారిత సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా విరాళాలు నేరుగా రాజధాని అభివృద్ధి ఖాతాలో జమ అవుతాయి.
గతంలో కూడా అమరావతి నిర్మాణానికి ప్రజల సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహించారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రజల నుంచి విస్తృత స్పందన లభించడంతోనే రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు పనులు ముందుకు సాగాయని తెలిపారు.
ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధానిని చట్టబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా విరాళాల రూపంలో సహకారం అందించి తమ రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయం అమరావతి నిర్మాణానికి కొత్త ఊపును తీసుకువస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

