అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ సముద్ర ఉత్పాదక హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దులోని దుగరాజపట్నంలో రూ. 29,253 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ‘నేషనల్ మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్’ కోసం ఒక గ్లోబల్ దిగ్గజ సంస్థను ‘యాంకర్ ఇన్వెస్టర్’గా తీసుకువచ్చే ప్రక్రియ ముగింపు దశకు చేరింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని పారిశ్రామిక వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రానికి ఉన్న సుమారు 1,053 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సముద్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం అంతర్జాతీయంగా పేరుగాంచిన నౌకా నిర్మాణ సంస్థలైన హెచ్డీ హ్యుందాయ్ , శామ్సంగ్, మరియు ఇమాబరి షిప్బిల్డింగ్ వంటి గ్లోబల్ కంపెనీలను ఏపీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. వీటిలో ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యాంకర్ ఇన్వెస్టర్గా పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు సిద్ధమైంది.
ప్రస్తుతం అంతర్జాతీయ నౌకా నిర్మాణ రంగంలో చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల హవా నడుస్తోంది. భారత్ వార్షికంగా కేవలం 0.01 మిలియన్ గ్రాస్ టన్నుల (GT) సామర్థ్యం మాత్రమే కలిగి ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘సముద్ర అమృత్ కాల్ విజన్-2047’ రోడ్మ్యాప్లో భాగంగా 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే టాప్-5 నౌకా నిర్మాణ దేశాల్లో ఒకటిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దుగరాజపట్నం క్లస్టర్ అందుబాటులోకి వస్తే.. ఏడాదికి సుమారు 1.2 మిలియన్ గ్రాస్ టన్నుల (GT) భారీ షిప్ల నిర్మాణ సామర్థ్యం ఏపీ సొంతమవుతుంది. ఈ క్లస్టర్లో కేవలం భారీ ఓడల నిర్మాణమే కాకుండా, షిప్ రిపేరింగ్ సెంటర్లు, డ్రై డాక్స్, అధునాతన షిప్-లిఫ్ట్ సిస్టమ్స్ మరియు నౌకల విడిభాగాల తయారీ పరిశ్రమలు కూడా కొలువుదీరనున్నాయి.
రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయంగా.. కేంద్రం మద్దతుతో అంతకంటే పది రెట్లు పెద్దదైన మెగా షిప్బిల్డింగ్ హబ్ను ఏపీ సాధించుకుంది. ఈ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) ప్రాజెక్ట్ ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యువతకు ఇంజనీరింగ్, స్టీల్, లాజిస్టిక్స్ మరియు ఎలక్ట్రికల్ రంగాలలో వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.



