2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల సాకుతో భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తప్పిస్తూ, ఆ స్థానాన్ని స్కాట్లాండ్కు కేటాయించింది. వచ్చే ప్రపంచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తాము భారత్లో ఆడలేమని, తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది. బంగ్లాదేశ్ విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ ఛైర్మన్ జై షా నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో, నిర్ణీత గడువులోగా బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో వారిని టోర్నీ నుంచి తొలగించాలని నిర్ణయించారు. బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు అవకాశం కల్పించారు. గత టీ20 వరల్డ్ కప్లలో బలమైన జట్లకు గట్టి పోటీ ఇచ్చిన చరిత్ర స్కాట్లాండ్కు ఉండటం గమనార్హం. తాజా మార్పుతో గ్రూప్-సిలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ చేరింది. ఇప్పుడు ఈ గ్రూపులో వెస్టిండీస్, నేపాల్, ఇటలీలతో పాటు స్కాట్లాండ్ తలపడనుంది.
తమ మొండివైఖరి కారణంగా బంగ్లాదేశ్ ఒక మెగా టోర్నీలో ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోగా, స్కాట్లాండ్ జట్టుకు ఇది అనూహ్యమైన వరంగా మారింది.

